22 మంది ఎంపీలున్న వైసీపీ రాష్ట్రంలో నిరసనలు చేస్తే మీకు మాకు ఏంటి తేడా?:  పవన్ కల్యాణ్

  • రాష్ట్రంలో నిరసనలు చేస్తే ప్రయోజనంలేదన్న పవన్
  • పార్లమెంటులో పోరాడాలని వైసీపీ ఎంపీలకు హితవు
  • స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యతను వివరించాలని వెల్లడి
  • టీడీపీ ఎంపీలను కూడా కలుపుకుని పోవాలని సూచన
  • అప్పుడే ప్రజలు నమ్ముతారని వివరణ
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఢిల్లీలో నిలదీసేందుకు వైసీపీ భయపడుతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 22 మంది ఎంపీల బలం ఉన్న వైసీపీ కేంద్రం పెద్దలను నిలదీసే బదులు, రాష్ట్రంలో నిరసనలు చేపడుతోందని, దాని వల్ల ఏంటి ప్రయోజనం అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.

వైసీపీ ఎంపీలకు స్టీల్ ప్లాంట్ అంశంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏంచేస్తారో పార్లమెంటు సాక్షిగా ప్రజలకు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఏ త్యాగాలు చేస్తే ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందో కేంద్రానికి అర్థమయ్యేట్టు చెప్పాలని స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ పై అంత ప్రేమే ఉంటే 22 మంది వైసీపీ ఎంపీలు, ముగ్గురు టీడీపీ ఎంపీలను కూడా కలుపుకుని ఒక నిర్ణయం తీసుకుని పార్లమెంటు వేదికగా పోరాడాలని, అప్పుడు ప్రజలు నమ్ముతారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 22 మంది ఎంపీలను పెట్టుకుని బలమైన పార్లమెంటు వ్యవస్థను వదిలేసి ఇక్కడికొచ్చి నిరసనలు తెలుపుతామంటే మీకు మాకు తేడా ఏముందని అని ప్రశ్నించారు.

Pawan Kalyan
YSRCP
MPs
Vizag Steel Plant
New Delhi
Parliament
Andhra Pradesh

More Telugu News